TOILET | న్యూయార్క్: టాయిలెట్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లడం… ఫోన్లో మునిగిపోయి ఎక్కువసేపు అందులోనే కూర్చోవడం… ఇటీవలి కాలంలో చాలామందికి అలవాటుగా మారుతున్నది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్లో 10 నిమిషాలకు మించి కూర్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మొలల వ్యాధి ముప్పు పెరుగుతుందని, కటి కండరాలు బలహీనంగా మారతాయని టెక్సాస్ యూనివర్సిటీ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ లై క్సూ హెచ్చరిస్తున్నారు.
సగటున 5 – 10 నిమిషాలకు మించి టాయిలెట్లో ఉండొద్దని న్యూయార్క్లోని స్టోని బ్రూక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరా మన్జూర్ సూచించారు. టాయిలెట్ కమోడ్పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని, దీంతో పాయువు, దిగువ పురీషనాళం చుట్టూ ఉండే సిరలు, రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలు ఏర్పడతాయన్నారు.