న్యూఢిల్లీ: ఇరాన్ తీవ్ర అంతర్గత సంక్షోభంలో ఉందని, తక్షణ సహాయం కోరుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాము పతనం అంచున ఉన్నామని ఇరాన్ ఇప్పుడే మాకు తెలియచేసింది. వారు తమ నాయకత్వ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నందున వీలైనంత త్వరగా హొర్ముజ్ జలసంధిని తెరువాలని మమల్ని కోరుతున్నారు(వారు అది చేయగలరని నేను నమ్ముతున్నాను) అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గమైన హొర్ముజ జలసంధిపై ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ జలమార్గం అమెరికా-ఇరాన్ ఘర్షణకు కేంద్ర బిందువుగా మారింది.
అణు కార్యక్రమం, కొన్ని డిమాండ్లపై బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదనలు పంపినట్లు తాజా మీడియా కథనాలు పేర్కొన్నాయి. హొర్ముజ్ గుండా స్వేచ్ఛగా రాకపోకలకు అనుమతించాలని ట్రంప్ ఇరాన్పై పదేపదే ఒత్తిడి తెచ్చారు. అలా చేయడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో ఆయన హెచ్చరించారు. అమెరికా తన దిగ్బంధాన్ని తొలగించి యుద్ధాన్ని ముగించడానికి అంగీకరిస్తే హొర్ముజ్ జలసంధిపై తన పట్టును సడలించడానికి తాము సిద్ధమని ఇరాన్ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ ప్రతిపాదనను చర్చించడానికి ట్రంప్నకు చెందిన జాతీయ భద్రతా బృందం సమావేశమైనట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోమవారం ధృవీకరించారు. దీని వివరాలను అధ్యక్షుడు తర్వాత వెల్లడిస్తారని ఆమె చెప్పారు.