న్యూయార్క్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతుండటంతో తదుపరి తైవాన్పై దాడులకు చైనా సిద్ధమవుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తైవాన్పై తదుపరి దాడులు జరుగుతాయి..ఉక్రెయిన్ పరిణామాలను డ్రాగన్ గమనిస్తోందని, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్సాహంగా వీటిని గమనిస్తున్నాడని ట్రంప్ ఫాక్స్ బిజినెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పైనా ట్రంప్ నేరుగా విమర్శలు గుప్పించారు. తైవాన్పై చైనా దాడులకు దిగుతుందని తాను అంచనా వేస్తున్నానని, అమెరికాలో చెత్త పాలన సాగుతుందో ఇది తేటతెల్లం చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు.
మన (అమెరికా) నేతల అసమర్ధతను వారు పసిగట్టారని..అందుకే వారు దాడులతో చెలరేగుతున్నారని..ఇవి వారి రోజులని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆప్ఘనిస్ధాన్లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆప్ఘనిస్ధాన్ను ఖాళీ చేయడంలో అమెరికా తీరును చైనా గమనించిందని చెప్పారు. ఇక పిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దాడులు కొనసాగుతున్నాయి. దీంతో తైవాన్పై ఇదే తరహాలో చైనా విరుచుకుపడవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులను తైవాన్ అధ్యక్షుడు సై యింగ్ తీవ్రంగా ఖండించారు. రష్యా దమనకాండ ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్ధిరతలకు విఘాతం కల్పించిందని అన్నారు.
అయితే ఉక్రెయిన్లో పరిస్ధితి తైవాన్లో పరిస్ధితి కంటే భిన్నమైనదని వ్యాఖ్యానించారు. ఎలాంటి అత్యవసర స్ధితి నెలకొన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక రష్యా- ఉక్రెయిన్ వార్ తీవ్రమవడంతో ఎస్-400 మిసైల్స్ను రంగంలోకి దించేందుకు రష్యా కసరత్తు ముమ్మరం చేసింది. ఎస్-400 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ సిబ్బంది నొవొసిబిర్క్ ప్రాంతంలో శత్రు లక్ష్యాలను ఛేదించేందుకు శిక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. ఇక గురువారం రష్యా-ఉక్రెయిన్ వార్ ఎనిమిదో రోజుకు చేరింది. రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి దాదాపు 2000 మందికి పైగా పౌరులు మరణించారని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వేసుల విభాగం వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి రష్యన్ సేనల ఉపసంహరణకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి బుధవారం ఓటు చేసింది.