Benjamin Netanyahu : ఇరాన్పై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య విబేధాలు వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇద్దరిమధ్యా జరిగిన ఫోన్ సంభాషణలో పరస్పరం విబేధించుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. శాంతి చర్చలు ఎటూ తేలడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ దాడి చేసే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్పై రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ట్రంప్, నెతన్యాహు చర్చించారు. వారు ఇద్దరూ దాదాపు గంటసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే, ఇరాన్తో వ్యవహరించాల్సిన అంశంలో ఇద్దరూ పరస్పర అభిప్రాయాల్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్పై త్వరగా యుద్ధాన్ని ప్రారంభించాలని నెతన్యాహు డిమాండ్ చేశారు. కానీ, కొంతకాలం వేచి చూద్దామని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాగుతున్నందున కొంతకాలంపాటు దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇద్దామని ట్రంప్ అన్నారు. ఈ నిర్ణయాన్ని నెతన్యాహు వ్యతిరేకించారు.
ఇరాన్పై సైనిక ఒత్తిడి తేవాలని నెతన్యాహు కోరారు. ఇరాన్పై మళ్లీ దాడులు చేసి, ఆ దేశ సైన్యాన్ని ఇంకా బలహీన పర్చాలని, ఇరాన్లోని కీలక నిర్మాణాలపై దాడులు చేసి ధ్వంసం చేయాలని ట్రంప్నకు నెతన్యాము సూచించారు. దీనివల్ల ఇరాన్ను ఇంకా ఒత్తిడిలోకి నెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, ఈ ప్రతిపాదనను ట్రంప్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, ఇలాంటి దశలో దాడులు చేయలేమని, త్వరలోనే చర్చల ద్వారా ఒక పరిష్కారం లభిస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధంగానే ఉందన్నారు.
కానీ, చర్చలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ నెతన్యాహుతో చెప్పారు. ప్రస్తుతం ఖతార్, పాకిస్తాన్లు ఇరాన్తో మధ్యవర్తిత్వం వహిస్తూ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలకు ఇరాన్ త్వరలోనే అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే నెతన్యాహు అమెరికాలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.