బ్రెజిల్తో ఒప్పందంలో తప్పిదాలు లేవు: భారత్ బయోటెక్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్తో జరిగిన ఒప్పందంలో ఎలాంటి తప్పిదాలు జరుగలేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. పక్కాగా నిబంధనలు పాటించామని చెప్పింది. బ్రెజిల్లో టీకా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. భారత్ మినహా ఇతర దేశాల్లో కొవాగ్జిన్ ఒక్కో డోసుకు 15-20 డాలర్లు వసూలు చేస్తామని ముందే ప్రకటించినట్టు గుర్తుచేసింది. బ్రెజిల్తో 15 డాలర్లకు ఒప్పందం చేసుకొన్నామని వెల్లడించింది. జూన్ 4న బ్రెజిల్లో టీకా అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిందని, కానీ టీకా కోసం ఆ దేశం ముందస్తు చెల్లింపులు జరుపలేదని తెలిపింది. దీంతో తాము ఒక్క డోసు కూడా సరఫరా చేయలేదని వివరించింది. కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇప్పటివరకు 16 దేశాలు అనుమతి ఇచ్చాయని, మరో 50 దేశాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని భారత్ బయోటెక్ ఈ సందర్భంగా తెలిపింది.
కృష్ణ ఎల్లకు సీఐఎస్ఎఫ్ భద్రత
భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లకు కేంద్రప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఎనిమిది మంది సీఐఎస్ఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణ కల్పించనున్నారు. భారత్బయోటెక్ సంస్థకు పహారా కాసేందుకు 64 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కూడిన సెక్యురిటీని ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.