Nepal Counting | నేపాల్ పార్లమెంట్, అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్ లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలు అందేసరికి ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాకు చెందిన నేపాలీ కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఖాట్మండులోని మూడు స్థానాలను దేవ్బా అభ్యర్థులు కైవసం చేసుకోగా.. సీపీఎన్-యూఎంఎల్ పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రధాని దేవ్బా-మాజీ ప్రధాని ఓలీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2015 లో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలు ఇవి.
నేపాల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, నేపాల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్ మాన్ సింగ్ ఖాట్మండు సీటును గెలుచుకున్నారు. ఆయన 129 ఓట్ల తేడాతో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన రవీంద్ర మిశ్రాను ఓడించారు. నేపాల్లోని అధికార నేపాల్ కాంగ్రెస్ పార్టీ మనగ్, ముస్తాంగ్ ప్రాంతాల్లో కూడా విజయం సాధించింది. మరోవైపు, లలిత్పూర్లో సీపీఎన్-యూఎంఎల్ ఒక్క సీటు గెలుచుకున్నది.
నేపాల్ పార్లమెంట్లోని మొత్తం 275 స్థానాలు, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో 550 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1990 లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది. దాంతో 2008 లో రాచరికం రద్దయింది. 2006 లో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. తరచూ నాయకత్వ మార్పులు, రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పోరు కారణంగా ప్రభుత్వాలు తరచుగా మారుతున్నాయి. 1990 నుంచి ఇప్పటి వరకు 30 ప్రభుత్వాలు మారాయి. 2008 లో రాచరికం ముగిసిన తర్వాత కూడా 10 ప్రభుత్వాలు మారడం విశేషం.