ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంలో జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఇప్పటికే ఖాళీగా ఉన్న 25 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ, యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా జాబ్ కేలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నిరసనలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తోకల చిరంజీవి, పవన్, వంశీ, ప్రభాకర్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.