ఇస్లామాబాద్: దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా లేవు. అయినప్పటికీ ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) చారిత్రక విజయాన్ని ఆ దేశంలోని ప్రధాన పత్రికలు మొదటి పేజీలో కవరేజ్ ఇచ్చాయి. ‘చంద్రుని దక్షిణ ధృవంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అవతరించింది’ అని పాకిస్థాన్కు చెందిన చాలా వార్తాపత్రికలు, న్యూస్ వెబ్సైట్లు తమ హెడ్లైన్స్లో పేర్కొన్నాయి. ‘చంద్రయాన్-3 చివరకు చంద్రుడిపై దిగింది’ అన్న పేరుతో పాకిస్థాన్ జియో న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. అలాగే పాకిస్థాన్కు చెందిన న్యూస్ ఇంటర్నేషనల్, డాన్ వార్తాపత్రిక, బిజినెస్ రికార్డర్, దునియా న్యూస్ వంటివి కూడా ‘చంద్రయాన్-3’ సక్సెస్ గురించి వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా సేకరించిన కథనాలను అందించాయి.
కాగా, పాకిస్థాన్ మీడియానే కాదు ఆ దేశ చట్టసభ్యులు కూడా భారత్ సాధించిన ఈ ఘనతను కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి ఇది గొప్ప క్షణం అని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి అన్నారు. ఈ విజయం పట్ల భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. అలాగే దీనికి ముందు చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ లైవ్ కవరేజ్ ఇవ్వాలని పాకిస్థాన్ మీడియాను కూడా ఆయన కోరారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా టాప్ మీడియా సంస్థలు కూడా ‘చంద్రయాన్-3’ విజయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి.