జెనీవా: ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. కొవిడ్-19 టీకాలు తీసుకోని వారిలో ఈ రకం శరవేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్వో అధిపతి టెడ్రోస్ అధనోమ్ గాబ్రియేసస్ తెలిపారు. డెల్టా రకంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నట్లు వెల్లడించారు.
ఈ దశలో కొన్ని దేశాల్లో కొవిడ్ నిబంధనలను సడలించడం కూడా ఆందోళనకరమేనని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్ సంక్రమణం పెరుగడం ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ సంక్రమణను నిరోధించడానికి ఉన్న అన్ని సాధానాలను ఉపయోగించడం అత్యవసరమని స్పష్టంచేశారు. డెల్టా రకం గతంలో ఐరోపాలో తీవ్రంగా వ్యాప్తి చెందిన ‘ఆల్ఫా’ కంటే ప్రమాదకరమన్నారు.
ఈ దశలో వ్యాధి తీవ్రమయ్యే ముప్పును, మరణాల ముప్పును కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకుంటాయని చెప్పారు. డెల్టా రకాలపై అవి చక్కగా పనిచేస్తాయని స్పష్టంచేశారు. ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం వంటివాటి వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో టీకాలు పొందినవారు కూడా మాస్కులు ధరించడం, ఇతర కొవిడ్ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది.
డెల్టా రకం విజృంభణ నేపథ్యంలో ఇలాంటి చర్యలు మరింత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. రెండు డోసులు పొందినవారు కూడా నిబంధనలను పాటించకపోతే ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారకులవుతారని సంస్థ సీనియర్ సలహాదారు బ్రూస్ ఆల్వార్డ్ పేర్కొన్నారు.