లాగోస్: నైజీరియా కమర్షియల్ క్యాపిటల్ లాగోస్లో 21 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ భవన శిథిలాల నుంచి మరో 14 మృతదేహాలను వెలికి తీయడంతో మొత్తం మృతుల సంఖ్య 36కు చేరింది. ఘటనా ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం లాగోస్లోని ఇకోయీ జిల్లాలో 21 అంతస్తుల భవనం కుప్పకూలింది.
దాంతో ఆ భవనంలోని వివిధ వ్యాపార సంస్థల్లో పని చేస్తున్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను వెలికితీయగా వారిలో 33 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో నలుగురు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎంత మంది పనిచేస్తున్నారనేది తెలియదు. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని లాగోస్ అధికారులు అంచనా వేస్తున్నారు.