Turkey Earthquake: టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. వేలసంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంచనా వేస్తున్నది.
కాగా, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూలిన భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకులాట కొనసాగుతున్నది. అయితే మంచు కురుస్తుండటో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. దీంతో నిరాశ్రయులు గజగజలాడే చలిలో వణికిపోతున్నారు. భూకంప ప్రభావం అధికంగా ఉన్న పది ప్రావిన్సుల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితి విధించారు.
భారీ భూకంపంతో కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం తన వంతుగా సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్తో కూడిన ఇండియ్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, రెస్క్యూ సిబ్బందిని టర్కీకి పంపింది.
విమానంలో 6.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలు, సర్జన్లు, పారామెడికల్ సిబ్బందిని తరలించింది. అదేవిధంగా 30 పడకల దవాఖానను అక్కడ నెలకొల్పేలా ఎక్స్రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లు కూడా వాటిలో ఉన్నాయి. ఇక 101 మంది జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ప్రత్యేక విమానాల్లో అక్కడికి చేరుకున్నారు.