Nepal Floods : పొరుగుదేశం నేపాల్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. శనివారం సాయంత్రానికి నేపాల్ వరద మృతుల సంఖ్య 60కి చేరింది.
స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. ఖాట్మండు వ్యాలీలో 34 మంది, బాగ్మతి ప్రావిన్స్లోని ఐదు జిల్లాల్లో 19 మంది, కోసి ప్రావిన్స్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సెర్చింగ్ కొనసాగుతోంది. భారీ వర్షాలకు దాదాపు అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
ఆ నీరంతా సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది. దాంతో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. దాదాపు 1,244 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించినట్లు సదరు మీడియా పేర్కొంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా అధికారులు 39 జిల్లాల్లో రహదారులను పూర్తిగా మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.