JK Rowling | ప్రముఖ రచయిత సల్మాన్పై రష్దీపై దాడి అనంతరం.. హ్యారీ పోర్టర్ నవలా రచయితి జేకే రౌలింగ్కు చంపుతామంటూ ట్విట్టర్ వేదికగా బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. అమెరికాలో శుక్రవారం రష్దీపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దాడిపై విచారం వ్యక్తం చేశారు. దాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రౌలింగ్ ట్వీట్ చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు. తర్వాత నంబర్ మీదే’ అంటూ బెదిరింపులకు దిగాడు. సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్క్రీన్షాట్ను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతాడని అధికారులు పేర్కొన్నారు. అతని దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని, వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడని చెప్పారు. సదరు వ్యక్తి సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తి హదీ మటర్ను ప్రశంసించడంతో పాటు షియా యోధుడు అంటూ ట్వీట్ చేశాడు. బెదిరింపుల తర్వాత రౌలింగ్ సదరు వ్యక్తి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ.. ‘ఇవి మీ మార్గదర్శకాలు.. రైట్? అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం దాడికి గురైన సల్మాన్ రష్దీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారని ఆయన ఏజెంట్ అండ్ర్యూ వైలీ పేర్కొన్నారు.
.@TwitterSupport These are your guidelines, right?
“Violence: You may not threaten violence against an individual or a group of people. We also prohibit the glorification of violence…
“Terrorism/violent extremism: You may not threaten or promote terrorism…” pic.twitter.com/BzM6WopzHa
— J.K. Rowling (@jk_rowling) August 13, 2022