Death sentence | నానాటికి ఉదృతమవుతున్న ప్రదర్శనలపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. చిన్నా, పెద్ద భేదం లేకుండా అణచివేస్తున్నది. హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో ఓ పోలీసు అధికారిని చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మైనర్లకు అక్కడి కోర్టు ఒకటి మరణశిక్ష విధించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకే ఈ ముగ్గురు మైనర్లపై కఠిన చర్యలు చేపట్టినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొన్నది.
టెహ్రాన్లో ఒక పోలీసు అధికారిని చంపారన్న నేరారోపణపై ముగ్గురు మైనర్లతో పాటు మరికొందరిపై విచారణ కొనసాగింది. కత్తులు, రాళ్లు, బాక్సింగ్ గ్లౌజులతో ఇరాన్కు చెందిన బసిజ్ పారామిలిటరీ దళ సభ్యుడిని హత్య చేసినట్లు వారిపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన ఇరాన్ రివల్యూషనరీ కోర్ట్ ముగ్గురు మైనర్లకు మరణశిక్ష విధించబడింది. ఈ తీర్పు వెలువరించిన కోర్టు.. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. బుధ, గురువారాల్లో టెహ్రాన్లోని కరాజ్లో ముగ్గురు మైనర్లపై విచారణ జరిగింది. ముగ్గురు మైనర్ బాలురపై అభియోగాలను ఇతర పెద్దలతో కలిపి విచారించవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఇరాన్ చట్టం ప్రకారం, రివల్యూషనరీ కోర్ట్ మైనర్లను విచారించడానికి అనుమతించదు.
ముగ్గురు మైనర్లపై విచారణ జరిపి కఠిన శిక్షలు వేయడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తప్పుపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం తప్పుడు పద్ధతులను అవలంభిస్తున్నదని పలు ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్లో నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ది గార్డియన్ పత్రికలో కథనం ప్రచురితమైంది. వీరిలో 12 మంది బాలికలు ఉన్నారని, వీరంతా 18 ఏండ్ల వయసులోపు వారని పేర్కొన్నది.
ఇలాఉండగా, ఇరాన్లోని ప్రదర్శనలు కుర్దిస్తాన్ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవ హక్కుల సంఘం ప్రకారం, ఇప్పటివరకు 200 మంది మైనర్లను అరెస్ట్ చేశారు. మరోవైపు, పోలీసులు జరిపిన కాల్పుల్లో 300 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఇరాన్లో నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న మరణశిక్షలపై అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గత నెల మానవ హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ వోల్కర్ టర్క్ కూడా ఈ శిక్షలపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.