ఎక్కడైతే మహిళలు గౌరవం, ఆదరణ పొందుతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అయితే, ఆడపిల్లల పుట్టుకను మహాపాపంగా భావించే వారు ఇప్పటికీ కొన్ని దేశాల్లో లేకపోలేదు. అలాంటి డజను దేశాలు రానున్న దశాబ్దంలో 47 లక్షల మంది మహిళా జనాభాను కోల్పోనున్నట్టు అమెరికా, సింగపూర్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మరో 17 దేశాలు లింగ అసమానత్వం దిశగా ప్రయాణిస్తున్నట్టు చెప్పారు. 1970నుంచి మూడు దశాబ్దాల పాటు భారత్, చైనాలో లింగనిర్ధారణలు, అబార్షన్లు పెద్దమొత్తంలో జరుగడం ఈ పరిస్థితులకు ఒక కారణమన్నారు. గత 50 ఏండ్లలో 204 దేశాల్లోని 326 కోట్ల మంది జనన, మరణాల సరళిని అధ్యయనం చేసి ఈ అంచనాకు వచ్చారు. ఈ వివరాలు ‘బీఎంజే గ్లోబల్ హెల్త్’లో ప్రచురితమయ్యాయి.
భారత్, చైనా, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, వియత్నాం, నైజీరియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఈజిప్ట్, టాంజానియా, ఖతార్.
పెండ్లికాని పురుషులు ఎంతమంది?
ఇప్పటికిప్పుడు దేశంలోని ప్రజలకు పెండ్లి చేయాల్సివస్తే.. మన దగ్గర పెండ్లికి వధువు దొరకని పెండ్లికొడుకుల సంఖ్య 5.4 కోట్లుగా ఉంటుంది. అదే చైనాలో ఈ సంఖ్య.. 3.5 కోట్లు.
ఆడబిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారు?
పురుషులే ఉద్యోగం, పోషణ బాధ్యతలను నిర్వహించగలరనే తప్పుడు భావన.
వయసైపోయాక తమ ఆలనాపాలనను పురుషులు మాత్రమే చూసుకోగలరనే తల్లిదండ్రుల భ్రమ.
ఆడపిల్లను చదివించాలి. ఉద్యోగం వచ్చేసమయానికి ఆమెకు పెండ్లి చేసి పంపించాలి. పెద్దమొత్తంలో కట్నం ఇవ్వాలి.
బాలికల జనాభా తగ్గిపోతే పర్యవసనాలేంటి?
మానవ పరిణామక్రమం అంతరించిపోవచ్చు.
వృద్ధులు, చంటిపిల్లల భవిష్యత్తు, సంప్రదాయ ఆచార వ్యవహారాలకు విఘాతం ఏర్పడవచ్చు.
భవిష్యత్తుల్లో వివాహంకాని పురుషుల సంఖ్య విపరీతంగా పెరిగి అసాధారణ ప్రక్రియలు చోటుచేసుకొని.. నేరాలు, హింస పెరుగొచ్చు.