వాషింగ్టన్, ఆగస్టు 7: అమెరికాలో రోజుకి సగటున నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరింది. 70 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కేసుల ఉద్ధృతి కలవరపెడుతున్నది. ఇది దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తున్నదో తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జూన్ చివర్లో అమెరికాలో రోజుకి సగటున 11 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష (1,07,143) దాటింది. అమెరికాలో గత నవంబర్లో రోజువారీ సగటు కేసులు లక్ష నమోదయ్యాయి. అప్పట్లో ఆ సంఖ్యను చేరడానికి ఆరు నెలలు పట్టింది. జనవరికల్లా 2.5 లక్షలకు చేరింది. జూన్లో కేసులు తగ్గినప్పటికీ ఆరు వారాల్లోపే మళ్లీ పెరిగాయి. రోజుకి సగటున నమోదయ్యే కేసులు లక్ష మార్కును దాటాయి. కరోనా మరణాలు కూడా పెరిగాయి. గత రెండు వారాలుగా రోజుకి 500 మరణాలు సంభవిస్తున్నాయి. అంతకుముందు అవి 270 ఉండేవి. వ్యాక్సిన్ వేయించుకోని వారి ద్వారా కరోనా వేగంగా వ్యాపిస్తున్నదని నిపుణులు పేర్కొన్నారు. ‘ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయకపోతే జనవరిలో మాదిరిగా కరోనా కేసులు ఇంకా పెరిగిపోతాయని అమెరికా సీడీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దవాఖానలు కరోనా రోగులతో నిండిపోయాయి.
వ్యాక్సిన్లు ఉన్నా మరణాలు విషాదకరం: బైడెన్
కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా బారినపడి ప్రజలు మరణిస్తుండటం విషాదకరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావని చెప్పారు. గత 9 నెలలుగా కరోనా మరణాలు 90 శాతం తగ్గినప్పటికీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు.