మాస్కో: ఉక్రెయిన్పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్ధించుకున్నారు. ఉక్రెయిన్ లేదా, ఉక్రేనియన్ ప్రజల ప్రయోజనాలను ఉల్లంఘించాలనే కోరికతో ఈ పరిణామాలు జరుగడం లేదని తెలిపారు. ప్రస్తుత దాడి సంఘటనలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బందీలుగా పట్టుకున్న వారిని రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాల నుంచి రక్షణ కోసమే తాజా పరిణామాలని అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లేదా రష్యా ఏర్పడినప్పుడు తమ జీవితాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అన్నది ప్రస్తుతం ఉక్రెయిన్లో భాగమైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అడుగలేదని పుతిన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్లో నివసిస్తున్న ప్రజల్లో ఎవరైనా ఇప్పుడు దీనిని కోరుకుంటే స్వేచ్ఛగా ఆ విధంగా ఎంపిక చేసుకునే హక్కు వారికి తప్పక ఉంటుందన్నారు.
మరోవైపు రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ వణికిపోతున్నది. ఇప్పటి వరకు 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మిలటరీ ఆపరేషన్లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రష్యా ప్రకటించిన యుద్ధంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
రష్యాను నిలువరించేందుకు ముందుకు రావాలని ఉక్రెయిన్ ప్రజలకు ప్రెసిడెంట్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. వారికి అవసరమైన తుపాకులు, ఆయుధాలను అందజేస్తామని చెప్పారు.