న్యూఢిల్లీ: ఇరాన్తో ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి జరిగిన యుద్ధంలో అమెరికా సుమారు 42 విమానాల(US Aircraft)ను కోల్పోయినట్లు అధికారిక నివేదిక ద్వారా వెల్లడైంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఆ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వాటిల్లో ఫైటర్ జెట్స్, డ్రోన్లు ఉన్నాయి. ఎన్ని విమానాలు ధ్వంసం అయ్యాయి, డ్యామేజ్ అయిన వాటి సంఖ్య ఎంత అన్న దానిపై మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 42 విమానాలను అమెరికా కోల్పోయినట్లు తెలుస్తోంది. వీటిల్లో నాలుగు ఎఫ్-15ఈ స్ట్రయిక్ ఈగల్ ఫైటర్ జెట్స్, ఒక ఎఫ్-35ఏ లైటనింగ్ 2 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, ఓ ఏ-10 థండర్బోల్ట్ 2 గ్రౌండ్ అటాక్ విమానం, ఏడు కేసీ-135 స్ట్రాటోటాంకర్ ఏరియల్ రీఫ్యుయలింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఓ ఈ-3 సెంట్రీ ఏడబ్ల్యేసీఎస్ విమానం, రెండు ఎంసీ-130 జే కమాండో 2 స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్క్రాఫ్ట్, ఓ హెచ్హెచ్-60 డబ్ల్యూ జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్, 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఓ ఎంక్యూ-4సీ ట్రిటన్ డ్రోన్ ఉన్నాయి.
అమెరికా చట్టసభ ప్రతినిధులు, కమిటీలకు సీఆర్ఎస్ విధానపరమైన, న్యాయపరమైన విశ్లేషణ అందిస్తుంది. అయితే అమెరికా రక్షణ శాఖ, సెంట్రల్ కమాండ్ ఇచ్చిన ప్రకటనలు, న్యూస్ రిపోర్టుల ఆధారంగా యుద్ధ విమానాల నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
మే 12వ తేదీన జరిగిన హౌజ్ అప్రాప్రియేషన్స్ సబ్కమిటీ విచారణ ప్రకారం.. ఇరాన్తో జరిగిన సైనిక ఘర్షణ కోసం సుమారు 29 బిలియన్ల డాలర్లు ఖర్చు అయినట్లు పెంటగాన్ అధికారి జూల్స్ డబ్ల్యూ హరస్ట్ తెలిపారు.