Covid JN.1 Variant | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 కారణంగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. దాదాపు నెలన్నరలోనే వేరియంట్ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. సింగపూర్, అమెరికా పాటు పలు దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు చైనాలో కొవిడ్ కారణంగా మరణాలు పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. భారత్లో కొవిడ్ను పరిశీలిస్తే.. రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 24 గంటల్లో 756 కొత్త కేసులు రికార్డవగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,049కి పెరిగింది. అయితే, జేఎన్.1 వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దని.. భవిష్యత్కు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలను పంపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా అందరూ కొవిడ్కు అలవాటు పడ్డారు. టీకా, రోగనిరోధక శక్తి కారణంగా కొత్త వేరియంట్లతో ఇన్ఫెక్షన్, తీవ్రమైన వ్యాధుల ప్రమాదం ఇప్పుడు గణనీయంగా తగ్గిందని కరోనాపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు పేర్కొంటున్నారు. కానీ, జేఎన్.1 వేరియంట్ స్వభావం నిపుణులను మరోసారి ఆందోళనకు గురి చేస్తున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేగాన్ని పరిగణలోకి తీసుకుంటే.. భవిష్యత్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఇదే వేగంతో కొనసాగితే రెండు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. మొదటగా ప్రజలు కరోనా మహమ్మారిపై మరింత కాలం పాటు కొనసాగించాల్సి రానుండగా.. రెండోది కొత్త వేరియంట్లు పుట్టుకు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు.
2021 చివరిలో కరోనా డెల్టా వేరియంట్ తర్వాత మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విపరీతంగా కేసులు పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వేరియంట్కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసింది. ఒమిక్రాన్లో 30 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉండగా.. అసలు వైరస్ కంటే భిన్నంగా కనిపించింది. ఈ రూపాంతరం రెండు సంవత్సరాల దాటినా నిరంతరం పరివర్తన చెందుతూ వస్తున్నది. ప్రస్తుతం రూపం మారి జేఎన్.1 మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త ఉత్పరివర్తనాలు ఒకటి, రెండు చిన్న ఉత్పరివర్తనలు మాత్రమే ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని.. కానీ ఒమిక్రాన్లో 30 కంటే ఎక్కువగా భిన్నంగా కనిపించాయి. ఒరిజినల్ కరోనాతో పోలిస్తే ఒమిక్రాన్ జన్యుపరంగా భిన్నంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
జేఎన్.1 వేరియంట్ తీవ్రమైన రూపాంతరమని.. ప్రతి అంశంలో గేమ్ ఛేంజర్గా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, కరోనా వైరస్పై నిరంతరం పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. వేరియంట్ మరో వేవ్కు కారణయ్యే తీవ్రమైన వైవిధ్యమైందని.. దీనిపై ప్రజలు అప్రమత్తం చేయాలన్నారు. వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో గతంలో మాదిరిగా రద్దీ ఎక్కువగా ఉండకపోయే.. మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ (CIDRAP) డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ఓస్టెర్హోమ్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్ వేగం పెరుగుతోందన్నారు. కొత్త వేరియంట్ల అభివృద్ధి దారి తీస్తుందన్నారు. కరోనా ఇంకా ముగియలేదని సూచిస్తుందన్నారు.