లండన్: బ్రిటన్లో స్కూళ్లు తెరిచిన నెల రోజుల తర్వాత పిల్లల్లో కరోనా వ్యాప్తిని గుర్తించారు. సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది. కరోనా టెస్ట్ నిర్వహించిన 25 మందిలో ఒకరికి వైరస్ సోకినట్లు వెల్లడించింది. గత వారం టెస్ట్ చేసిన 85 మందిలో ఒకరు మాత్రమే కరోనా బారినపడినట్లు తెలిపింది.
స్కూళ్లకు వెళ్లే పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వింటర్ ప్లాన్కు రూపకల్పన చేస్తున్నారు. అలాగే 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా టీకా వేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, బ్రిటన్లో 12-15 ఏండ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ గత వారం నుంచే ప్రారంభమైంది.