Covid-19 New Symptoms | కరోనా మహమ్మారి కొత్త వేరింట్ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నది. వేరియంట్ కారణంగా అనేక దేశాల్లో రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. భారత్లో గత 24గంటల్లో 760 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కొత్త కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి పెరిగింది. జేఎన్.1 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ముప్పును పెంచుతున్నట్లుగా కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ ఉధృతిని నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు.
వేరియంట్ను అర్థం చేసుకునేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన అధ్యయనాలు చాలా వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్ విషయంలో తేలికపాటి లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. వైరస్ కేవలం కొమొర్బిడిటీలతో బాధపడే, రోగ నిరోధశక్తి బలహీనంగా ఉన్న వారిలో మాత్రమే తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. తాజాగా వేరియంట్ సోకిన వారిలో రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించారు. ఈ లక్షణాలు చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయని యూకే పరిశోధకులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెలుగుచూసిన నివేదికల్లో జేఎన్.1 వేరియంట్ సోకిన చాలా వ్యక్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్లో మాదిరిగానే లక్షణాలున్నట్లుగా చెప్పారు.
యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. రెండు కొత్త లక్షణాల్లో నిద్రలో ఇబ్బంది, ఆందోళన సమస్యలను గుర్తించారు. ఈ రెండు లక్షణాల్లో ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, అలసట, జ్వరం, శరీర నొప్పులు, ఇతర లక్షణాలు సైతం ఉండవచ్చన్నారు. లక్షణాల గురించి తెలుసుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వారిలో ముక్కుకారటం 31.1శాతం ఉంటుంది. దగ్గుకు 22.9శాతం, తలనొప్పి (20.1 శాతం), అలసట (19.6 శాతం), కండరాల నొప్పి (15.8 శాతం) సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గొంతునొప్పి (13.2 శాతం), నిద్రపోవడంలో ఇబ్బంది (10.8 శాతం), ఆందోళన (10.5 శాతం) ప్రముఖంగా కనిపిస్తాయన్నారు. నిద్రలో ఇబ్బంది, ఆందోళనతో దీర్ఘకాలిక ఆరోగ్య దుష్ప్రభావాలుంటాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
యూకే ఆరోగ్య నిపుణులు.. జేఎన్.1 వేరియంట్ చాలా సందర్భాల్లో తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ.. ప్రమాదం 10శాతం కంటే తక్కువగానే ఉంటుంది. మొత్తం మరణాల రేటు 2శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. చాలామంది రోగులు ఇంట్లోనే కోలుకుంటున్నారన్నారు. కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉన్నా.. తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా లేదన్నారు. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తే.. సరైన సమయంలో నియంత్రించకపోతే రాబోయే నెలల్లో కొత్త వేరియంట్ పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే జేఎన్.1 వేరియంట్ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉందని రుజువైందని ఆరోగ్య సంస్థలు పేర్కొంటున్నాయి. గత నెలల్లో కొత్త కేసులు 52శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైరస్ స్పైక్ ప్రోటీన్లో అదనపు మ్యుటేషన్ (L455S) కలిగి ఉందని, జేఎన్1 వేరియంట్ అధిక ట్రాన్స్మిసిబిలిటీని కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రజలందరూ మాస్క్లు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని.. వైరస్ సోకుండా ఉండేందుకు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.