జోహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో కరోనా మళ్లీ ప్రభావం చూపుతున్నది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ పరిస్థితులపై అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరీక్షలిస్తున్నారు. కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలోనే గుర్తించిన విషయం తెలిసిందే. రూపాంతం గుర్తించిన కొద్ది రోజుల్లోనే వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అగ్రరాజ్యం అమెరికాపై సైతం వేరియంట్ ప్రభావం చూపింది. గత డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కారణంగా ఇన్ఫెక్షన్ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది. అయితే, మళ్లీ ప్రస్తుతం పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. ఇదే సమయంలో వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరే కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఫిఫ్త్ వేవ్ను సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
అమెరికా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దక్షిణాఫ్రికాలో తాజాగా కేసులు పెరగడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణం. బీఏ.4, బీఏ.5 వేరియంట్లు ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలో 60శాతం మంది ఈ రెండు వేరియంట్లతోనే బాధపడుతున్నారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తెలిపింది.
దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల ప్రకారం.. బీఏ4, బీఏ.5 వేరియంట్లు గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ప్రభావం చూపుతున్నాయని, అయితే వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు వైరస్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధక శక్తి పెరగడంతో వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటుందని దక్షిణాఫ్రికా సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ ఇన్నోవేషన్ డైరెక్టర్ టులియో డి ఒలివేరా పేర్కొన్నారు. కొవిడ్-19 భిన్నంగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. అమెరికా తూర్పు తీరంలో బీఏ.4, బీఏ.5, బీఏ2.12.1 సబ్ వేరియంట్ల కారణంగా కేసులు పెరిగాయని గమనించామని వైట్హౌస్ కరోనా వైరస్ టాస్క్ఫోర్స్ మాజీ కో-ఆర్డినేటర్ డెబోరా బిర్క్స్ పేర్కొన్నారు.
కరోనా మరో వేరియంట్ను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలన్నారు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో జరిగిందని, ఆ తర్వాత అమెరికాలోనూ ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సారి అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త, పాత వేవ్ల మధ్య నాలుగు నుంచి ఆరు నెలలు తేడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ సమయంలో ప్రజల సహజ రోగనిరోధక శక్తి తగ్గడం ప్రారంభమవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అమెరికాలో సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. అమెరికాలో కరోనా సోకిన తర్వాత 60 శాతం మంది పెద్దలు, 75 శాతం మంది పిల్లల జనాభాలో యాంటీబాడీలు ఉంటాయి. ఈ యాంటీబాడీలు భవిష్యత్లో కరోనా ఇన్ఫెక్షన్ నుంచి ఎంత వరకు రక్షిస్తాయో అంచనా వేయడం కష్టం. అందుకే వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్ల విషయంలో ప్రజలు నిరంతరం నిపుణులు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని సూచించారు.