BQ.1 Variant | భారత్లో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. చైనాలో ఒకే రోజు రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నేషనల్ హెల్త్ బ్యూరో గణాంకాల ప్రకారం.. డ్రాగన్ కంట్రీలో ఒకే రోజు 31,454 కేసులు రికార్డయ్యాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి అధికార యంత్రాంగం పాక్షిక లాక్డౌన్, ట్రావెల్ ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతున్నది.
గత నెలలోనూ వైరస్ కట్టడికి చైనాలోని అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. ఇటీవల కాస్త తగ్గుముఖంపట్టినట్లు కనిపించడం ఆంక్షలు ఎత్తివేయగా కేసులు వెలుగు చూస్తున్నాయి. అలాగే మరణాల సంఖ్య పెరుగుతున్నది. నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హు జియాంగ్ మాట్లాడుతూ, చైనాలోని అనేక ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల తీవ్రంగా, సంక్లిష్టంగా ఉన్నాయని, పలుప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రమాదం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చైనాలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధానంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఏ.5 అని అంచనా వేస్తున్నారు. చైనాతో పాటు అమెరికాలోని అనేక ప్రాంతాల్లో కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని భావిస్తుండగా.. బీక్యూ.1 (BQ.1), బీక్యూ1.1 (BQ1.1) సబ్ వేరియంట్లు కేసుల పెరుగుదలకు అసలు కారమని గుర్తించారు. వేరియంట్ల కారణంగా అమెరికాతో పాటు చైనాలోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో 35శాతం కేసులు ఈ రెండు వేరియంట్లవల్లేనని నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ వేరియంట్లు భారత్లోనూ కనిపించాయి. అక్టోబరులో తొలిసారి పుణేలో BQ.1 కేసు నమోదైంది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకొని, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం భారత్లో కొవిడ్ నియంత్రణలోనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 360 కొత్త కేసులు నమోదవగా.. ఐదుగురు మృతి చెందారు. దేశంలో 6,400 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నివారణకు ప్రజలందరూ చర్యలు కొనసాగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చైనా, అమెరికా సహా పలుదేశాల్లో కేసులు పెరుగుతున్న తీరును దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.