పటాన్చెరు, మార్చి 27: 65వ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఇసుకమేటలు ఏర్పడ్డాయి. ఏండ్లుగా రోడ్ల బాగోగులు చూడకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, భద్రతపై ప్రకటనలు తప్పా చర్యలు కానరావడం లేదు. బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి రుద్రారం గణేశ్గడ్డ వరకు జాతీయదారికి ఇరువైపులా మట్టి, దుమ్ము, ఇసుక, కంకర పేరుకుపోయింది. బీటీ రోడ్డును సైతం ఒక్కో వైపు ఎనిమిది అడుగుల వరకు ఇసుక ఆక్రమించుకుపోయింది. దీంతో సగం బీటీ రోడ్డుపైనే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. జాతీయ రహదారిని ఇసుక కప్పివేయడంతో ద్విచక్రవాహనదారుల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఇసుకతో జారిపడినవే కనిపిస్తున్నాయి. నక్కవాగు నుంచి ముత్తంగి రింగ్రోడ్డు జంక్షన్, గ్రామం, చర్చి, ఇస్నాపూర్ చౌరస్తా, లక్డారం గేటు, రుద్రారం గ్రామాల పరిధిలో భారీగా ఇసుక మేటలు రోడ్లుపై కనిపిస్తున్నాయి. భారీ వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ద్విచక్రవాహనదారులు జారిపడుతున్నారు. వారిపైనుంచి భారీ వాహనాలు వెళ్లడంతో మృత్యువాత పడుతున్నారు. లక్డారం గేటు వద్ద భారీగా వస్తున్న కంకర వాహనాలు, ఇస్నాపూర్, ముత్తంగిలో భారీ నీళ్ల ట్యాంకర్లతో రోడ్లు పాడవుతున్నాయి.
భద్రత ఏది.?
ఇస్నాపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై మందిరం, దర్గాను అధికారులు తొలగించి ట్రాఫిక్ సమస్యకు చెక్పెట్టారు. అదే సమయంలో అర కిలోమీటర్ చొప్పున రోడ్డును ఆరులైన్లుగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతానికి రాగానే అన్ని వాహనాలు అతివేగంగా ప్రయాణిస్తున్నాయి. ముత్తంగి చర్చి నుంచి ఇస్నాపూర్ చౌరస్తా, ఆంధ్రకాలనీ వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. యూ టర్న్లు పెట్టినా ఎక్కడా సిగ్నల్స్ లేవు. అతివేగ నిరోధానికి బోర్డులు పెట్టలేదు. యూ టర్న్ల వద్ద ప్రజలు రోడ్డు దాటేందుకు జీబ్రా లైన్లు వేయలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తేనే ముత్తంగి ఏపీజీవీబీ బ్యాంక్ వద్ద ప్రజలు రోడ్డు దాటే అవకాశం ఉంది. అతివేగం కారణంగా ఈ యూటర్న్ వద్ద ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రింగురోడ్డునుంచి కిందికి దిగిన వాహనాలు హరిదోశ హోటల్ ముందు యూటర్న్ తీసుకునేందుకు స్థలం సరిపోవడం లేదు. పైగా భారీగా ఇసుక పేరుకుని వాహనదారుల కళ్లల్లో, స్థానికంగా ఉన్న ప్రజల ఇండ్లపై దుమ్ము పడుతున్నది. ఎన్హెచ్-65 అధికారులు మరమ్మతుల కోసం, రహదారుల భద్రత కోసం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిత్యం రహదారిపై జిల్లా అధికారులు, జాతీయ రహదారుల అధికారులు ప్రయాణిస్తున్నా వారు ఇసుకను తొలగించే ప్రయత్నం చేయడం లేదు.
ప్రమాదాలను నిలువరిస్తాం..
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నిలువరించడంపై జాతీయ రహదారుల శాఖ దృష్టి సారించింది. రోడ్డుపై ఉన్న మట్టి, ఇసుకను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన సమస్యలను సర్వే చేసి వాటిని పరిష్కరిస్తాం.
ఇసుకతో ప్రమాదాలు…
జాతీయ రహదారిపై పేరుకుపోయిన ఇసుకతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముత్తంగి రింగురోడ్డు జంక్షన్ నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు రోడ్డుపై ఇసుక, కంకర పేరుకుపోయింది. టూవీలర్స్ ఇసుకలో జారిపడిపోతున్నాయి. యూటర్న్ల వద్ద ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. రోడ్డు దాటే పరిస్థితి లేదు. వాహనాల వేగాన్ని సైతం నిలువరించాల్సిన అవసరం ఉంది.