న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నా కరోనా విస్తృతికి మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి దాదాపు ఏడు లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 10 వేల మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఇరాన్ తదితర దేశాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా ఉన్నది.
గడిచిన 24 గంటల్లో ఒక్క అమెరికాలోనే దాదాపు 1.16 లక్షల కేసులు, 614 మరణాలు నమోదయ్యాయి. ఇరాన్లో 39 వేలకు పైగా కేసులు, 568 మరణాలు చోటచేసుకున్నాయి. బ్రిటన్లోనూ కొత్తగా ఇవాళ దాదాపు 33 వేల మందికి కొవిడ్ సోకింది. జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మందికి వైరస్ సోకగా 43,35,111 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 18.5 కోట్ల మందికి పైగా కోలుకున్నారు.
ఆస్ట్రేలియాలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో సిడ్నీలో లాక్డౌన్ అమలుచేస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్కు అడ్డుకట్టవేయడంలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అదనపు మిలిటరీ సిబ్బందిని కూడా రంగంలోకి దించుతున్నట్టు న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం వెల్లడించింది. డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్నదని, దాని కట్టడి కోసం గురువారం సాయంత్రం నుంచి వారంపాటు ఆంక్షలు అమలుచేస్తామని ప్రకటించింది.