మాజీ కమ్యూనిస్టు నేత ఆరోపణ
బీజింగ్, సెప్టెంబర్ 22: కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియడానికి రెండు నెలల ముందే ఆ మహమ్మారి గురించి అమెరికాను హెచ్చరించానని చైనా కమ్యూనిస్టు మాజీ నాయకుడొకరు తెలిపారు. 2019 అక్టోబర్లో జరిగిన భారీ మిలిటరీ టోర్నమెంట్ను కరోనా వ్యాప్తికి చైనా వాడుకున్నదని వెల్లడించారు. ఆయన పేరు వీ జింగ్షెంగ్. ఆస్ట్రేలియా స్కై న్యూస్ డాక్యుమెంటరీలో ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘కారణం తెలియని నిమోనియా’ గురించి డిసెంబర్ 31న తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చైనా నివేదించిందని, కానీ నవంబర్ మధ్యలోనే అలాంటి కేసులను చైనా గుర్తించిందని వివరించారు. నవంబర్లోనే తాను అమెరికా అధికారులను మొదటిసారిగా అప్రమత్తం చేశానని చెప్పారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా పుట్టుకొచ్చిందన్న పలు దేశాలకు అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే.
చైనా బడుల్లో పాఠంగా గల్వాన్ ఘర్షణ
బీజింగ్, సెప్టెంబర్ 22: భారత సరిహద్దు ప్రాంతాల ఆక్రమణకు చైనా పన్నిన కుట్ర ఫలితం గల్వాన్ ఘర్షణ. ఆ కుట్ర ఇప్పుడు చైనా బడి పిల్లలకు దేశ భక్తి పాఠం అయింది. పిల్లల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు చైనా గల్వాన్ ఘర్షణను పాఠ్యాంశం చేసింది. చైనా అధికారిక మిలిటరీ వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా సైనికులు వీరోచితంగా పోరాడారంటూ పొగిడింది. గతేడాది జూన్ 15న గల్వాన్ ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబుతోపాటు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనావైపు 35 మందికిపైగా మరణించారు.