బాలి, నవంబర్ 15: భారత్, చైనా బలగాల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కరచాలనం చేసుకొన్నారు. ఇందుకు ఇండోనేషియాలోని బాలి వేదికైంది. జీ 20 సదస్సులో పాల్గొంటున్న వీరిద్దరు.. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిన్పింగ్ చేయి అందించగా, మోదీ కరచాలనం స్వీకరించారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొన్నారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారంతా ఆసక్తిగా తిలకించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోదీ భేటీ అయ్యారు.