పెషావర్: పాకిస్థాన్లోని పెషావర్ మసీదులో జరిగిన పేలుడులో సుమారు 28 మంది మృతిచెందగా, 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే మసీదులో పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 300 నుంచి 400 మంది పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిటీ పోలీసు ఆఫీసర్ మహమ్మద్ ఇజాజ్ ఖాన్ దీనిపై ఓ ప్రకటన కూడా చేశారు. పేలుడు ధాటికి మసీదు గోడ కూలిందని, ఆ శిథిలాల కింద పోలీసులు చిక్కుకుని ఉన్నట్లు ఆయన తెలిపారు. వారిని రక్షించేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
మసీదు పేలుడు ఆత్మాహుతి దాడా లేక బాంబ్ బ్లాస్ట్ చేశారా అన్న విషయాన్ని ఇంకా అధికారులు ద్రువీకరించలేదు. పేలుడు పదార్ధాలు మాత్రం వాసన వస్తున్నాయని, కానీ ఈ ఘటన గురించి ఊహాగానాలు చేయలేమని పోలీసు ఆఫీసర్ ఖాన్ తెలిపారు. మసీదులో పేలుడు జరిగిన సమయంలో అక్కడ 400 మంది పోలీసులు గస్తీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే సెక్యూర్టీ లోపం జరిగి ఉంటుందని ఆయన అంచనా వేశారు.
గాయపడ్డవారు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల .. వారికి రక్తాన్ని డోనేట్ చేయాలని గవర్నర్ హజి గులామ్ అలీ ప్రజల్ని కోరారు. పేలుడు వల్ల బిల్డింగ్లో ఒక భాగం కూలిపోయిందని, అయితే ఆ కూలిన గోడ సమీపంలో ఉన్న వారు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వాళ్లే ఇంకా ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
పెషావర్లో గత ఏడాది కూడా భారీ బ్లాస్ట్ జరిగింది. కొచ్చా రిసల్దార్ ప్రాంతంలో ఉన్న షియా మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ అటాక్లో 63 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఖైబర్ ఫక్తున్వా ప్రాంతంలో శాంతి భద్రతలు లోపించాయని, పోలీసు వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తామని ప్రధాని షెహబాజ్ తెలిపారు.
జోర్ ప్రార్థనల సమయంలో దాదాపు 400 మంది పోలీసుల వరకు ఆ మసీదులో ప్రార్థనలు చేస్తుంటారు. ఒకవేళ ఆ బ్లాస్ పోలీస్ లైన్ లోపల జరిగి ఉంటే, అది పెద్ద లోపమని, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని ఖాన్ తెలిపారు.
బాంబర్లు రెండు చెక్ పోస్టులు దాటి ఉంటారని కొందరు అంచనా వేస్తున్నారు. పెషావర్లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో పోలీస్ లైన్స్ మసీదు ఉందని, సున్నితమైన ప్రదేశంలో ఉన్న ఆ మసీదులో బ్లాస్ జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖైబర్ రాష్ట్రానికి చెందిన కౌంటర్ టెర్రరిజం శాఖ, పోలీసు దర్యాప్తు సంస్థ ఆఫీసులు అక్కడే ఉంటాయని, అక్కడ ఎప్పుడూ వెయ్యి మంది పోలీసులు ఉంటారని అధికారులు చెబుతున్నారు.
పేలుడు జరిగిన మసీదు ప్రాంతానికి వెళ్లాలంటే కనీసం రెండు చెక్ పోస్టులను దాటి వెళ్లాలని ఓ అధికారి తెలిపారు. కనీసం మూడు సార్లు చెకింగ్ నుంచి తప్పించుకున్న బాంబర్..ఆ మసీదు వద్దకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.