Muhammad Yunus : బంగ్లాదేశ్లో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు బంగ్లా రాజధాని ఢాకాలో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేత ముహమ్మద్ యూనస్ ఇంటి వద్ద ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఆందోళన చేశారు. తమకు వేతనాలు పెంచాలని, తొమ్మిదవ పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఢాకాలోని యూనస్ అధికారిక నివాసం వద్ద ఆందోళన బాటపట్టారు.
శుక్రవారం ఉదయం నుంచి వారు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఎన్నికైతే మళ్లీ తమకు వేతనాల పెంపు ఉండదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అందుకే నిరసనలకు దిగారు. అయితే, ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు అక్కడి భద్రతా దళాలు ప్రయత్నించాయి. దీంతో అటు ఆందోళనకారులకు, ఇటు భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో 15 మంది వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ ఉన్న యూనస్ ఇంటిలోపలికి చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. బారికేడ్లు తొలగించి, గేట్లు ఎక్కి మరీ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. వాటర్ కెనాన్లు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారుల్ని అడ్డుకోలేకపోయారు. పైగా వీరు పోలీసులపై తిరుగబడ్డారు.
ఇరువర్గాల తోపులాటతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనల్లో 15 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి.. అంటే 18 నెలలుగా బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వమే నడుస్తోంది. అందుకే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈనెల 12న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నామని చెబుతోంది. కానీ, ఆందోళనలు మాత్రం ఆగడం లేదు.