Xi Jinping | చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. వచ్చే నవంబర్లో ఆగ్నేయాసియాలో పర్యటించనున్నారు. కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదేనని చెబుతున్నారు. ఆగ్నేయాసియా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు విదేశీ అధినేతలతోనూ జీ జిన్పింగ్ భేటీ కానున్నారు. వచ్చే నవంబర్లో ఇండోనేషియాలో జీ-20 దేశాధినేతల సదస్సు జరుగనున్నది.
జీ జిన్పింగ్తో ముఖాముఖీ సమావేశం విషయమై జో బైడెన్ టీం ఇంకా దృవీకరించలేదు. వాణిజ్య సంబంధ సమస్యలు, తైవాన్ వివాదంపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బైడెన్, జిన్పింగ్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. జిన్పింగ్తో ముఖాముఖీ భేటీ సమయం, స్థలం చెప్పలేమని అమెరికా అధికారి తెలిపారు.
ఇంతకుముందు జో బైడెన్, జీ జిన్పింగ్ గత నెల 28న రెండు గంటలకు పైగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. చైనా తమదని ప్రకటించుకున్న తైవాన్లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నివారణకే గత నెల 28న జీ జిన్పింగ్, జోబైడెన్ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.