బీజింగ్: చైనాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 10,815 మందికి వైరస్ సోకగా, నిన్న 8,838 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 2240 మందికి లక్షణాలు ఉండగా, 6598 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం వెల్లడించింది. వైరస్ వల్ల కొత్తగా ఎవరూ చనిపోలేదని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,65,312 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది.
కొత్తగా నమోదైన కేసుల్లో రాజధాని బీజింగ్లో 1130 పాజిటివ్ కేసులు ఉన్నాయని, షాంఘైలో 131, గువాంగ్జౌలో 1000కి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఛాంగ్క్వింగ్లో 1845 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు.
కాగా, కరోనా నియంత్రణ కోసం తీసుకొచ్చిన ‘జీరో కొవిడ్’ పాలసీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నెల 7న దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలను సడలించింది. జిల్లావ్యాప్త లాక్డౌన్ను అపార్టుమెంట్లు, బిల్డింగ్లకు పరిమితం చేసింది. జీరో కొవిడ్ పాలసీని దాదాపుగా రద్దు చేసే అంతగా ఆంక్షలను సడలించింది.