China on Corona | ఒక్క కరోనా కేసు నమోదైనా డ్రాగన్ ఉలికి పడుతోంది. కఠిన ఆంక్షలు విధిస్తూ లాక్డౌన్ అమలు చేసేందుకు పూనుకుంటున్నది. ఇటీవల పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో కఠిన నిబంధనల అమలుకు పూనుకున్నది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందుల పాలవ్వకుండా నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నది. నిత్యావసర వస్తువుల సరఫరాలో అవాంతరాల్లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జారీ చేసిన ఆదేశాలు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్లో దర్శనం ఇచ్చాయి.
వచ్చే ఏడాది జరిగే వింటర్ ఒలింపిక్స్కు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండాలనే చైనా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. సోమవారం చైనాలో 92 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత సెప్టెంబర్ నుంచి అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నది.