ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని తమ దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 13 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాకిస్థాన్లోగల తమ రాయబార కార్యాలయంలోని దౌత్య విభాగం తాత్కాలికంగా మూసి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
కానీ, పాకిస్థాన్లోని తమ దౌత్య విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయడం వెనుక ఇతర కారణాలేమీ లేవని, కేవలం సాంకేతికపరమైన సమస్యల వల్లే అలా జరిగిందని చైనా తెలిపింది. అయితే, కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్లో శాంతిభద్రతలు సరిగా లేవని, ఆ దేశంలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని చైనా హెచ్చరికలు జారీ చేసింది.
పాకిస్థాన్లో గత ఏడాదికాలంగా ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయని, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్లు తరచూ దాడులకు పాల్పడుతున్నందున చైనా పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆరోజు చేసిన హెచ్చరిక ప్రకటనలో పేర్కొన్నది. చైనీయులే లక్ష్యంగా కూడా దాడులు జరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ రాయబార కార్యాలయంలోని తమ దౌత్య విభాగాన్ని మూసివేయడంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్లోని భద్రతాలోపం కారణంగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలవల్లే తమ దౌత్య విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని పేర్కొంది.