బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా ఆంక్షలకు సిద్ధమైంది. పెలోసీతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు చైనా వెల్లడించింది. చైనా నిర్ణయానికి వ్యతిరేకంగా పెలోసీ తైవాన్లో పర్యటించినట్లు డ్రాగన్ దేశం పేర్కొన్నది. చైనా అంతర్గత వ్యవహారాలు, దేశ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగే రీతిలో పెలోసీ ప్రవర్తించినట్లు ఆ దేశం ఆరోపించింది. వన్ చైనా సిద్ధాంతానికి వ్యతిరేకంగా, తైవాన్లో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే రీతిలో అమెరికా స్పీకర్ వ్యవహరించినట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వై తెలిపారు.
తైవాన్ను వంటరిగా వదిలేది లేదని పెలోసీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ దేశానికి ఆమె సంఘీభావం తెలిపింది. కానీ చైనా మాత్రం వన్-చైనా పాలసీ నినాదాన్ని వినిపిస్తోంది. తైవాన్ తమలో అంతర్భాగమని చైనా పేర్కొంటోంది. మరోవైపు ఇవాళ కూడా తైవాన్ సమీపంలో చైనా సైనిక డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో పలు అమెరికా నేతలపై చైనా చర్యలు తీసుకున్నది. మాజీ విదేశాంగ మంత్రి మైక్ పొంపియాతో పాటు పాటు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవరోపై ఆంక్షలు విధించింది. చైనాలో ఎంటర్ కాకుండా వాళ్లపై ఆంక్షలు అమలు చేశారు. చైనా కంపెనీలతో వ్యాపారాన్ని కూడా నిషేధించారు.