China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 38,421 కేసులు వెలుగు చూసినట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. కాగా, సోమవారం 40,347 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిస్తోంది.
తాజాగా నమోదైన కేసుల్లో 3,561 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. 34,860 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. వరుసగా రెండో రోజూ ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. దీంతో మరణాల సంఖ్య 5,233 వద్ద కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఇక చైనాలో 315,248 కొవిడ్ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ‘జీరో కొవిడ్’ పాలసీని అమల్లోకి తెచ్చి దేశవ్యాప్తంగా లక్షల మందిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో ఆంక్షలకు విసుగెత్తిపోయిన చైనీయులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజల చేపడుతున్న ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్తోపాటు ఇతర నగరాలకు వ్యాపించాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి జిన్పింగ్ ప్రభుత్వానికి, కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడు జిన్పింగ్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. తమకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఆందోళనలు యూనివర్సిటీలకు కూడా వ్యాపించాయి. విద్యార్థులు పోస్టర్లు అతికించి నిరసన వ్యక్తం చేశారు.