బీజింగ్ : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో చైనా అప్రమత్తమైంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న చైనా కరోనా కట్టడికి సర్వశక్తులొడ్డుతోంది. కేవలం ఒక కొవిడ్-19 కేసు వెలుగుచూడటంతో దక్షిణ సరిహద్దులో రెండు లక్షల జనాభాతో కూడిన నగరాన్ని ఈ వారం లాక్డౌన్ చేసిన డ్రాగన్ తాజాగా వియత్నాం సరిహద్దులో పలు కేసులు బయటపడిన డాగ్జింగ్ నగరాన్ని మూసివేసింది.
నగరంలోని 1.3 కోట్ల మంది ప్రజలను ఇండ్లలోనే ఉండాలని ఆదేశించింది. నగరంలో ప్రతి ఒక్కరినీ టెస్ట్ చేయాలని అధికారులు నిర్ణయించడంతో సిటీలో కార్యాలయాలు, వాణిజ్య సంస్ధలు, విద్యాలయాలు, ప్రజా రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. వియత్నాం నుంచి ఏటా మిలియన్ టన్నుల సరుకు రవాణాకు ఎంట్రీ పాయింట్ అయిన డాగ్జింగ్ సిటీ వద్ద కస్టమ్స్ ప్రక్రియనూ నిలిపివేశారు. వియత్నాంలో చైనా పౌరులు రోడ్డు మార్గం ద్వారా దేశంలోకి రావద్దని చైనా ఎంబసీ విజ్ఞప్తి చేసింది.
చైనాలో ఒమిక్రాన్ ఎంట్రీతో లక్షలాది మంది కుటుంబాలకు దూరంగా హాలిడేలను గడపాల్సిన పరిస్ధితి నెలకొంది. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు రోజు మార్చి రోజు ఇంటికి ఒకరిని చొప్పున అధికారులు అనుమతిస్తున్నారు. ఒమిక్రాన్ భయాలతో చైనా విధిస్తున్న నియంత్రణలు 2020 ఆరంభంలో కరోనా కట్టడికి వుహాన్ షట్డౌన్ను మరిపిస్తున్నాయి. కరోనా వైరస్ కేసులతో పాటు హంటా వైరస్ వెంటాడుతుండటంతో ముప్పు రెండింతలైందని నగరపాలక సంస్ధ అధికారి జాంగ్ ఫెంఘూ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా కట్టడికి వియత్నాం సరిహద్దుల్లో చైనా చేపట్టిన నియంత్రణలతో 6000కుపైగా పండ్ల ట్రక్కులు సరిహద్దుల్లో నిలిచిపోయాయి. ఇక గత రెండు వారాలుగా చైనాలో ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. నూతన సంవత్సర వేడుకలకు ముందు ఒమిక్రాన్ వ్యాప్తితో ఈసారి వేడుకలతో పాటు కుటుంబాలకూ ప్రజలు దూరం కావాల్సిన పరిస్ధితి ముంచుకొచ్చింది.