China Terror support | ఉగ్రవాదంపై చైనా తన తీరును మార్చుకోలేదు. ఉగ్రవాదులకు అండగా నిలిచి మరోసారి తన వంకరబుద్ధిని చాటుకున్నది. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా అడ్డుకున్నది. పాకిస్తాన్కు చెందిన లష్క్ ఏ తోయిబా ఉగ్రవాది షాహీద్ మహమ్మద్ను అంతర్జాతీయంగా ఉగ్రవాదిగా ప్రకటించాలని తీసుకొచ్చిన తీర్మానాన్ని చైనా రెండు రోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్-చైనా మైత్రిబంధం మరోసారి బయటపడింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పాకిస్తాన్కు చెందిన హఫీజ్ తల్హా సయీద్ను ప్రకటించాలని అమెరికా, భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా యూఎన్ ఎస్సీలో అడ్డుకున్నది. రెండు రోజుల వ్యవధిలో ఇలా భారత్, అమెరికా తీర్మానాలను అడ్డుకోవడం చైనాకిది రెండోసారి. ముంబై దాడుల మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడే ఈ హఫీజ్ తల్హా సయీద్.
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో 1267 అల్ ఖైదా సాంక్షన్స్ కమిటీ ప్రకారం భారత్, అమెరికాలు తీర్మానాలు ప్రవేశపెట్టాయి. పాకిస్థాన్పై ఎప్పటికప్పుడు ప్రేమ కురిపించే చైనా.. ఈ తీర్మానాల విషయంలోనూ తన వక్ర బుద్దిని ప్రదర్శించింది. తీర్మానాలను చైనా అడ్డుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గత నాలుగు నెలల్లో ఐదుసార్లు ఇదే మాదిరిగా పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతర్జాతీయ తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని తీసుకొచ్చిన తీర్మానాలకు చైనా అడ్డుపడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్లాక్ లిస్ట్లో పడకుండా చైనా కాపాడిన పాకిస్తాన్కు చెందిన ఐదో ఉగ్రవాది తల్హా కావడం విశేషం. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారత్లో పర్యటిస్తున్న తరుణంలో చైనా ఈ విధంగా ఉగ్రవాదులకు అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది.