China | కరోనా ఆంక్షలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా అమలు చేస్తున్న చైనా ప్రభుత్వం.. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధన జనవరి 8 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నెగిటివ్ ధ్రువపత్రం చూపిస్తే చాలని పేర్కొంది. 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
చైనాలో కరోనా మహమ్మారి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రోజురోజుకు అక్కడ పరిస్థితి చేయి దాటిపోతోంది. డ్రాగన్ దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది కేసులు బయటపడుతున్నాయి. ఐసీయూ రోగులతో నిండిపోగా, మార్చురీలు, శ్మశానవాటికల ముందు కరోనా మృతదేహాలు క్యూ కడుతున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్లో ఒకే రోజు పదిలక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులు భారీ మొత్తంలో కొవిడ్ కేసులు నమోదవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. జీరో కొవిడ్ నిబంధనను ఎత్తివేయడంతోనే డ్రాగన్ దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్న ఈ తరుణంలో చైనా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.