బీజింగ్/షాంఘై, నవంబర్ 28: చైనాలో జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్తోపాటు ఇతర నగరాలకు వ్యాపించాయి. సోమవారం వేలాది మంది వీధుల్లోకి వచ్చి జిన్పింగ్ ప్రభుత్వానికి, కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడు జిన్పింగ్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. తమకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. షాంఘైలో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. సుమారు వెయ్యి మంది ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనలు యూనివర్సిటీలకు కూడా వ్యాపించాయి. విద్యార్థులు పోస్టర్లు అతికించి నిరసన వ్యక్తం చేశారు. లాక్డౌన్ ఆంక్షల కారణంగా సకాలంలో అగ్నిమాపక వాహనాలు చేరుకోకపోవడంతో జిన్జియాంగ్ రీజియన్లో ఉరుమ్ఖీలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం కారణంగా 10 మంది మృతిచెందడం.. తాజా ఆందోళనకు బీజం వేసింది.
దశాబ్ద కాలంలో చూడని నిరసనలు..
వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకొన్న జిన్పింగ్కు ఈ ఆందోళనలు పెద్ద పరీక్ష అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్ద కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి ఆందోళనలను చూడలేదు. మరోవైపు చైనాలో కొవిడ్ కొత్త కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. సోమవారం 39,452 కేసులు నమోదయ్యాయి.