బీజింగ్: చైనా తన దూకుడును మరింత తీవ్రం చేస్తున్నది. భారత్ సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఒక వంతెనను నిర్మిస్తున్నది. తన సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఈ నిర్మాణం చేపడుతున్నది. జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ పొందిన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చైనా భూభాగంలో ఉన్న సరస్సులో ఒక భాగం మీదుగా వంతెనను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తున్నది. సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూ దీనిని నిర్మిస్తున్నారు.
సైమన్ ట్వీట్ చేసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం సరస్సు ఇరుకైన భాగంలో వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినట్లుగా కనిపిస్తున్నది. ఆ వంతెన నుంచి రోడ్డు కనెక్టివిటీని కూడా చైనా అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీంతో సైనికులు, భారీ ఆయుధాలను సరిహద్దు ప్రాంతాలకు త్వరగా తరలించే సామర్థ్యం చైనాకు ఇది అందిస్తుందని నిఫుణులు అంచనా వేస్తున్నారు.