బీజింగ్ : ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని కోసం రూ.14 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును టిబెట్లోని నైంగ్చి నగరంలో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి 300 బిలియన్ కిలోవాట్-అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. టిబెట్లోని యార్లంగ్ జాంగ్సో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. దీనిని భారత్, బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. గతంలో నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ కన్నా మూడు రెట్లు పెద్దది. టిబెట్-అరుణాచల్ ప్రదేశ్ మధ్య ‘గ్రేట్ బెండ్’ వద్ద బ్రహ్మపుత్ర నది భారీ వంపుతో 2,000 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది.
చైనా-భారత్ మధ్య ఘర్షణ జరిగితే, చైనా ఈ డ్యామ్ నుంచి ఒకేసారి అత్యధికంగా నీటిని విడుదల చేస్తుందని, అప్పుడు అరుణాచల్, అస్సాం రాష్ర్టాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై పర్యవేక్షణ కొనసాగిస్తామని భారత్ ఇటీవల తెలిపింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దిగువ ప్రాంతాలు నష్టపోకుండా జాగ్రత్త వహించాలని చైనాకు సూచించింది.