ఖార్టూమ్: ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan)లో గత వారం రోజులుగా ఆ దేశ ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. ఇప్పటి వరకు 300 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుడాన్లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. రాజధాని ఖార్టూమ్లోని భారతీయ రాయబార కార్యాలయం ఫైటింగ్ జోన్లో ఉన్నట్లు తెలిపింది. ఎంబసీ తెరిచే ఉందని, పని చేస్తున్నదని పేర్కొంది. అయితే ఖార్టూమ్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉన్న ఇండియన్ ఎంబసీ బిల్డింగ్ సమీపంలో ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య భారీస్థాయిలో పోరాటం జరుగుతున్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారతీయ రాయబార కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని, వారంతా ఇళ్ల నుంచి పని చేస్తున్నారని తెలిపింది. దీంతో రక్షణ, లేదా సహాయం కోసం భారతీయులు ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లవద్దని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సుడాన్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాగా, 2021 అక్టోబర్లో సైనిక తిరుగుబాటు వల్ల సుడాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్ బుర్హాన్, ఆయన డిప్యూటీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)కు నేతృత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర పోరాటం జరుగుతున్నది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడుతున్నాయి. యుద్ధవిమానాలు, మెషిన్ గన్లు అమర్చిన ట్రక్కులు సహా సాయుధ వాహనాలతో జన రద్దీ ప్రాంతాలపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో సుడాన్లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Also Read: