కరోనా మహమ్మారి నివారణ కోసం తీసుకునే వ్యాక్సిన్లలో బూస్టర్ డోసు వేయించుకోవాలనుకునే వారికి 100 డాలర్ల(దాదాపు రూ.7560) నగదు బహుమతినిస్తామని అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డెబ్లాసియో ప్రకటించారు. ఈ రివార్డుకు అర్హులైన వ్యక్తులు మూడో డోస్ టీకాను డిసెంబర్ 31వ తేదీ లోపు వేయించుకోవాలని ఆయన సూచించారు.
‘ఇది గొప్ప అవకాశం..బూస్టర్ డోస్ పొందండి.. మీ కుటుంబాన్ని, నగరాన్ని రక్షించుకోండి’ అంటూ డెబ్లాసియో ట్వీట్ చేశారు. దీనికిముందు జులైలో కూడా న్యూయార్క్ నగరంలో టీకా మొదటి డోస్ పొందిన వ్యక్తులకు ఆయన వంద డాలర్లు ఇచ్చారు.
అమెరికాలో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల న్యూయార్క్ నగరంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు. గత వారం రోజులుగా న్యూయార్క్ నగరంలో సగటున ప్రతి 200 మందిలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని సమాచారం. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని న్యూయార్క నగర మేయర్ చెప్పారు.