ఏటా వాతావరణంలోకి 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్
మెల్బోర్న్: పర్యావరణానికి అడవి పందులు తీవ్రమైన హాని తలపెడుతున్నాయి. మట్టిలో చిక్కుకున్న కార్బన్ను వెలికితీయడం ద్వారా అవి ఏటా ప్రపంచవ్యాప్తంగా 49 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. ఇది 11 లక్షల కార్ల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలకు సమానమని క్వీన్స్లాండ్ (ఆస్ట్రేలియా), కాంటర్బరీ (న్యూజిలాండ్) విశ్వవిద్యాలయాల నిపుణులు వెల్లడించారు. అడవి పందుల వల్ల వాతావరణంపై పడుతున్న దుష్ప్రభావాన్ని వారు అత్యాధునిక మ్యాపింగ్ టెక్నిక్లతో నిర్ధారించారు. ప్రస్తుతం ఐదు ఖండాల్లో ఉన్న అన్ని రకాల జంతువుల గణాంకాల ఆధారంగా 10 వేల సిమ్యులేటెడ్ మ్యాప్లతో అడవి పందుల సాంద్రతను లెక్కించి అవి ఎంత మట్టిని పెకలిస్తున్నాయో తేల్చారు. ‘అడవి పందులు ట్రాక్టర్ల లాంటివే. ఆహారం కోసం భూమిని దున్నడంలో అవి ట్రాక్టర్లకు ఏమాత్రం తీసిపోవు. ఈ విధంగా అవి 34 వేల నుంచి 1.24 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలోని మట్టిని పెకలిస్తున్నాయి. ఇది చాలా పెద్ద భూభాగం. దీని నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ వల్ల మృత్తిక ఆరోగ్యం క్షీణించడంతోపాటు జీవవైవిధ్యానికి, ఆహార భద్రతకూ ముప్పు వాటిల్లుతుంది. వాస్తవానికి వాతావరణంలో కంటే మట్టిలోనే మూడు రెట్లు ఎక్కువగా కార్బన్ ఉంటుంది’ అని పేర్కొన్నారు.