బెర్న్, జూలై 2: క్యాన్సర్ వ్యాధిపై పూర్తిగా పట్టుసాధించేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంత మేర విజయం సాధించారు కూడా. అయితే క్యాన్సర్ కణాలు పరిశోధకులకు మరిన్ని సవాళ్లు విసురుతున్నాయి. నిద్రపోయే సమయంలో క్యాన్సర్ కణాలు రక్తం ద్వారా ఇతర అవయవాలకు సోకుతున్నాయని గుర్తించారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడే వారిలో ఇది ఎక్కువగా ఉంటున్నదని తెలుసుకున్నారు. స్విట్జర్లాండ్లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బేసెల్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేపట్టింది. రోగి నిద్రించే సమయంలో క్యాన్సర్ కణాలు క్రియాశీలం అవుతున్నట్టు ఈ బృందం గుర్తించింది. మెలటోనిన్, టెస్టోస్టిరాన్ వంటి జీవగడియారాన్ని నిర్ధారించే హార్మోన్లు ఈ కణితుల ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఒక అవయవానికి వచ్చిన క్యాన్సర్ వేరే అవయవానికి రక్తం ద్వారా సోకితే దాన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు.
ఎలుకలపై ప్రయోగం..
మెటాస్టాటిక్ క్యాన్సర్ను నిర్ధారించుకునేందుకు రొమ్ము క్యాన్సర్ కణాలను ఎలుకలకు ఎక్కించి ప్రయోగాలు జరిపారు. రోజు మొత్తం సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్ కౌంట్ను గమనించారు. ఎలుకలు నిద్రపోయే సమయంలో క్యాన్సర్ కణాలు క్రియాశీలకంగా మారి రక్తంలోకి చేరి వేరే అవయవాలకు సోకుతున్నట్టు గుర్తించారు.
అలా అని నిద్రపోకుండా ఉండొద్దు..
నిద్రపోతే క్యాన్సర్ కణాలు వేరే కణాలకు సోకుతున్నాయనే భయంతో నిద్రపోకుండా ఉండటం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రతో పాటు హార్మోన్ల స్థాయులు కూడా క్యాన్సర్ కణాల విస్తరణపై ప్రభావం చూపుతాయని గుర్తుచేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరుగాల్సి ఉందని పరిశోధనల్లో పాలు పంచుకున్న నికోలో అసిటో
తెలిపారు.