Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు రూ.10 వేల ఫైన్ వేశారు లంకాషైర్ పోలీసులు. ఈ మేరకు ప్రధానికి శుక్రవారం 100 పౌండ్ల చలాన్ జారీ చేశారు. రెండు రోజుల క్రితం గురువారం జరిగిన ఘటనపై రిషి సునాక్ క్షమాపణ కూడా చెప్పారు. రిషి సునాక్ ప్రభుత్వంలో ఉండగా ఫైన్ విధించడం ఇది రెండోసారి. 2020 జూన్లో కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించి.. నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ దంపతులతో కలిసి బర్త్డే పార్టీకి హాజరైనందుకు రిషి సునాక్కు కూడా ఫైన్ విధించారు పోలీసులు.
బ్రిటన్లో కారులో ప్రయాణించే ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుంటే రూ.10వేల జరిమానా విధిస్తారు. ఈ అంశం కోర్టుకు వెళితే.. సదరు ప్రయాణికుడిపై రూ.50 వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. అయితే, రిషి సునాక్ కారులో వెనుక సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ చేయడం లేదు. కానీ కారు నడుస్తున్న వేళ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారాయన. దీని ఆధారంగా బ్రిటన్ పోలీసులు చర్య తీసుకున్నారు.
ఈ అంశం వెలుగు చూడటంతో 10-డౌనింగ్ స్ట్రీట్లోని ప్రధానమంత్రి కార్యాలయం రియాక్టయింది. తన పొరపాటును ప్రధాని రిషి సునాక్ పూర్తిగా అంగీకరిస్తున్నారని, జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతున్నారని తెలిపింది. ఫైన్ చెల్లించేందుకు సిద్ధం అని పేర్కొంది. ఇదిలా ఉంటే లంకాషైర్ పోలీసులు ట్విట్టర్లో ఈ సమాచారం వెల్లడించినా ప్రధాని రిషి సునాక్ పేరు బయట పెట్టలేదు. 42 ఏండ్ల లండన్ వ్యక్తిపై ఫైన్ వేశామని పేర్కొన్నారు.. కారు నడుస్తుండగా సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ వేసినట్లు తెలిపారు.
భారత్లోనూ గతంలో ప్రధానమంత్రి కారుపై చలాన్ విధించారు. ఈ ఘటన 1982లో చోటు చేసుకున్నది. నాడు తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ.. ఢిల్లీలో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్నారు. అప్పట్లో ఏషియన్ గేమ్స్ జరుగనున్నాయి. ప్రధానిగా ఇందిరాగాంధీ కారు.. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్కు సమీపాన మింటో బ్రిడ్జి ఏరియాకు వచ్చింది. అక్కడే ట్రాఫిక్ రూల్స్కు భిన్నంగా కారు పార్క్ చేశారు. ఆ కారు తొలగించాలని కిరణ్బేడీ సిబ్బంది అడిగినా సదరు డ్రైవర్ అంగీకరించకపోవడంతో క్రేన్ సాయంతో తీసేశారు. కారుపై చలాన్ కూడా వేశారు. ఆ తర్వాతే కిరణ్ బేడీ.. వీఐపీ సెక్యూరిటీ ఇన్చార్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు.