రోమ్: జీ20 సమావేశాలు రోమ్ నగరంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాలకు హాజరైన బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో చిక్కుల్లో పడ్డారు. పలు జీ20 కార్యక్రమాలకు ఆయన హాజరుకాలేకపోయారు. ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రతి ఈవెంట్కు హాజరవ్వగా.. బొల్సనారో మాత్రం అదృశ్యమయ్యారు. కొన్ని ఈవెంట్లలో మాత్రం ఒంటరిగా తిరుగుతూ కనిపించారు. బొల్సనారో ట్రిప్ను కవర్ చేయడానికి వచ్చిన బ్రెజిల్ రిపోర్టర్పై అధ్యక్షుడి సెక్యూర్టీ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్రెజిల్ టీవీ గ్లోబోకు చెందిన జర్నలిస్టు లియోనార్డో మొంటెయిరోపై అధ్యక్షుడు బొల్సనారో భద్రతా సిబ్బంది దాడి చేసినట్లు తెలుస్తోంది. జీ20 సమావేశాలకు వచ్చిన బొల్సనారో పలు ఈవెంట్లలో దూరం దూరంగా ఉండిపోయారు. ఆయన పలు సందర్భాల్లో ఒంటరిగా ఉన్నట్లు కొన్ని వీడియోల ద్వారా స్పష్టమైంది. ఇక త్రేవి ఫౌంటేన్ వద్ద ప్రపంచ నేతలు దిగిన గ్రూపు ఫోటోకు కూడా బొల్సనారో హాజరుకాలేదు.
వాస్తవానికి బొల్సనారోపై బ్రెజిల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ మహమ్మారి నిర్మూలనకు బొల్సనారో ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ దేశంలో కోవిడ్ వల్ల సుమారు ఆరు లక్షల మంది మరణించారు. దీంతో సేనేట్ ప్యానెల్ నేరాభియోగం చేసింది. బొల్సనారోను ఆ కేసుల్లో విచారించాలని తీర్మానించింది. అయితే గ్లోబో మీడియా కూడా బొల్సనారోపై వ్యతిరేక కథనాలు ప్రసారం చేసింది. జర్నలిస్టు లియోనార్డోపై ముందు నుంచే బొల్సనారో ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోమ్ నగరంలో జీ20 సమావేశాల వేళ ఆ గొడవ మరింత రాజుకున్నది. రోమ్ వీధుల్లో బొల్సనారోకు వ్యతిరేకంగా కొందరు నిరసన ప్రదర్శన చేపట్టారు. రిపోర్టర్లకు వ్యతిరేకంగా కూడా బొల్సనారో మద్దతుదారులు ప్రదర్శనలో పాల్గొన్నారు.