దుబాయ్: 2.6 బిలియన్ సంవత్సరాల కిందట భూమిని ఆస్టరాయిడ్ ఢీకొనడంతో ఏర్పడినట్టు భావిస్తున్న 555.55 క్యారెట్ల నల్లటి వజ్రాన్ని దుబాయ్కు చెందిన సోత్బే అనే కంపెనీ సోమవారం ప్రదర్శించింది. దీనిని ప్రదర్శించడం ఇదే తొలిసారి. ‘ఎనిగ్మా’ పేరిట పిలుస్తున్న ఈ వజ్రం 55 కోణాలతో ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. మధ్యప్రాచ్య దేశాల్లో అరచేయి నిర్మాణాన్ని పోలిన (ఖంసా గుర్తు) వజ్రాలను శుభసూచకంగా భావిస్తారని, ఎనిగ్మా అదే ఆకారంలో ఉండటమే గాక, బరువు విషయంలోనూ ఐదు అంకెలు వచ్చేలా (555.55) ఉండటం గొప్పవిషయమని నగల నిపుణురాలు సోఫి స్టీవెన్స్ అన్నారు. వచ్చే నెలలో లండన్లో ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు. వేలంలో రూ. 50.71 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు.