హైదరాబాద్, ఏప్రిల్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): స్కాట్లాండ్ ప్రజలపై పక్షులు యుద్ధం ప్రకటిస్తున్నాయి. దేశంలోని రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో గుమిగూడిన వారిపై, ముఖ్యంగా పిల్లలపై సీగల్స్ అనే పక్షులు దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఏకంగా 16 వరకూ జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. తొలుత ఒక పక్షి ఒక పిల్లాడిపై ఎటాక్ చేయగానే.. అప్పటికే సిద్ధంగా ఉన్న మరిన్ని పక్షులు ఒకదాని వెనుక ఒకటి వచ్చి బాధిత బాలుడిని పొడిచినట్టు వీడియోల్లో కనిపిస్తున్నది.
మనుషుల మాదిరిగా పక్షులు కూడా ప్లానింగ్ ప్రకారం దాడులు చేయడమేంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే స్కాట్లాండ్లో ప్రస్తుతం ఈస్టర్ ఎగ్ హంట్ వేడుకలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో ఓ ఆటను నిర్వహిస్తారు. ఈ ఆటలో దాచిపెట్టిన ఉడికిన కోడి గుడ్లను పిల్లలు కనిపెట్టి బహుమతులు గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే, తాము పెట్టిన గుడ్లను తీసుకోవడానికి పిల్లలు వస్తున్నారేమోననుకొని సీగల్స్ ఇలా దాడి చేస్తున్నట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.