బీజింగ్, ఏప్రిల్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్పై చైనా భారీ ఫైన్ వేసింది. ఏకంగా రూ.20,775 కోట్ల (2.78 బిలియన్ డాలర్లు లేదా 18.23 బిలియన్ యువాన్లు) జరిమానాను శనివారం అక్కడి రెగ్యులేటర్లు విధించారు. 2019లో అలీబాబా మొత్తం దేశీయ అమ్మకాల్లో (455.71 బిలియన్ యువాన్లు) ఇది 4 శాతానికి సమానం. కాగా, అక్రమాలు, గుత్తాధిపత్య నిరోధక నిబంధనల ఉల్లంఘనే ఈ జరిమానాకు కారణమని రెగ్యులేటర్లు తెలిపారు. మార్కెట్లో అలీబాబా గుత్తాధిపత్యం చలాయిస్తున్నదని, తమ వేదికల ద్వారా వస్తూత్పత్తుల స్వేచ్ఛాయుత సర్క్యులేషన్ను హరిస్తున్నదని 4 నెలల దర్యాప్తులో తేలినట్లు చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ప్రకటించింది. 2015 నుంచే అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నదన్న రెగ్యులేటర్.. వాటిని ఇక ఆపాలని హెచ్చరించింది. చైనా ప్రభుత్వం సైతం టెక్ ఇండస్ట్రీల దూకుడుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అలీబాబాసహా దేశంలోని పలు భారీ ఇంటర్నెట్ సంస్థల పెత్తనాన్ని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆర్థిక, ఆరోగ్య సేవలు, ఇతరత్రా సున్నితమైన రంగాల్లోకి పరిశ్రమ విస్తరిస్తున్న వేళ గుత్తాధిపత్య ధోరణి మార్కెట్ను దెబ్బతీస్తున్నదన్నది. అందుకే ఈ ఏడాది టెక్నాలజీ సంస్థల్లో గుత్తాధిపత్య వైఖరి నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని డ్రాగన్ సర్కారు తెలిపింది.
ఈ జరిమానా అలీబాబా అధినేత జాక్ మాకు రెండో ఎదురుదెబ్బ. గత నవంబర్లో యాంట్ గ్రూప్ ఐపీవోను రెగ్యులేటర్లు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పబ్లిక్ ఇష్యూ విలువ రూ.37 బిలియన్ డాలర్లు. దీనికి బ్రేకులు పడటంతో అలీబాబాకు భారీ నష్టమే వాటిల్లింది. అప్పట్నుంచి గ్రూప్ వ్యాపార కార్యకలాపాల్లోనూ వేగం తగ్గగా, జాక్ మా సైతం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం ఇంకా ప్రభావితం చేసింది. ఇప్పుడు జరిమానా రూపంలో మరో పిడుగు పడింది.